తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆర్జీవీ ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. సోషల్ మీడియా వేదికగా అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ కల్యాణ్పై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఏపీలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్మకు ఒంగోలు పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. రెండుసార్లు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ, ఆయన ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వర్మ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.