కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ ఏర్పాటు ‘పర్యావరణహితమైన వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి రావాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
ఈ సంస్థ ఓర్వకల్లు దగ్గర 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఎం.ఓ.యూ. చేసుకొంది. ఇందుకు సంబంధించిన వివరాలను పీపుల్ టెక్ గ్రూప్ సి.ఈ.ఓ. శ్రీ టి.జి.విశ్వప్రసాద్ తెలియచేశారు. ‘వాహన తయారీ, ఆర్. అండ్ డి. కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలాంటివి ఇందులో ఉంటాయి. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈ.వి. పార్కు. దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, 25 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయ’ని వివరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ‘కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ ఏర్పాటు కానుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇదొక మైలు రాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకి అనువైన విధానాలు తీసుకొచ్చింది’ అన్నారు. ఉప ముఖ్యమంత్రివర్యులతో సమావేశమైన వారిలో శ్రీ భాస్కర రెడ్డి, శ్రీ రవికిరణ్ ఆకెళ్ళ, శ్రీ బాబ్ డఫ్ఫీ, శ్రీ స్టీవ్ గెర్బర్, శ్రీ హెరాల్డ్ రక్రిజెల్ ఉన్నారు.