సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ అనే వర్కింగ్ టైటిల్తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఓ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. రాజమౌళి.. మహేశ్ పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా మేకర్స్ ఎంతో జాగ్రత్త పడుతున్నారు. దీనిలో భాగంగా ఈ భారీ ప్రాజెక్టులో నటిస్తున్న మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇతర నటీనటుల వివరాలు బయటకు రాకుండా మేకర్స్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో చిత్రం యూనిట్కి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో ‘నాన్-డిస్క్లోజ్ అగ్రిమెంట్’ (ఎన్డీఏ) చేయించినట్లు ఆంగ్ల పత్రిక కథనాలు వెలువరించాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం దర్శక-నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటకు చెప్పినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రిన్స్ మహేశ్ సహా షూటింగ్ స్పాట్లో ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదట. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు.