అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. 85 ఏళ్ల దాస్ గత కొంతకాలంగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.సత్యేంద్ర దాస్ తన 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో కీలక పాత్ర పోషించారు. రామాలయ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచే ఆయన రామమందిర అర్చకుడిగా ఉన్నారు.