తమిళంతో పాటు తెలుగులో వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రం డ్రాగన్. లవ్ టుడే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో హీరోగా నటించగా.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, జార్జ్ మరియన్, కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ మేనన్, మిస్కిన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిత్రం విడుదలైన పది రోజుల్లోనే రూ.100 కోట్లను వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా చూసిన రజనీకాంత్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు దర్శకుడు అశ్వత్ మారిముత్తుని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించాడు. ఇక రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు అశ్వత్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.రజనీ సర్ డ్రాగన్ సినిమా చూసి.. ఎంత అద్భుతమైన రచన అశ్వత్! అద్భుతంగా తీశావు అంటూ అభినందనలు తెలిపాడు. ”మా లాంటి దర్శకులందరికీ ఒకటే కల. మంచి సినిమా తీయాలి. ఆ సినిమా రజనీ సర్ చూసి మనల్ని తన ఇంటికి పిలిచి శుభాకాంక్షలు చెప్పాలి. మన సినిమా గురించి మాట్లాడాలి. అని డైరెక్టర్ కావాలని కష్టపడే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ యొక్క కల. ఈ రోజు నా కల నెరవేరిన రోజు” అంటూ అశ్వత్ రాసుకోచ్చాడు.