అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడి ఉందని అన్నారు. ఆ నానుడిని నమ్ముతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశామని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశామని వివరించారు.