గతంలో విజయవాడ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ రూ.1 కోటి విరాళం ప్రకటించిన అంశం నేడు ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. వరద బాధితులకు జగన్ రూ.1 కోటి ఇచ్చారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు మంత్రి పార్థసారథి స్పందిస్తూ… ప్రభుత్వానికి జగన్ విరాళం ఇవ్వలేదని స్పష్టం చేశారు. దాంతో బొత్స స్పందిస్తూ … కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే జగన్ ప్రకటించిన కోటి రూపాయాల విరాళాన్ని తామే వరద బాధితులకు అందజేశామని వెల్లడించారు. అందుకు తానే బాధ్యత తీసుకున్నానని వివరించారు. వరద బాధితులకు పార్టీ తరఫున సాయం అందించామని చెప్పారు. ఈ క్రమంలో, మండలిలోనే ఉన్న రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందిస్తూ… జగన్ ప్రకటించిన రూ.1 కోటి విరాళంపై విచారణ కమిటీ వేసేందుకు సిద్ధమని అన్నారు.