చేనేత వస్త్రాల మార్కెటింగ్ రంగంలో ఒక ముఖ్యమైన ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఆప్కో, కో-ఆప్టెక్స్ సంస్థలు తమ షోరూమ్లలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలను విక్రయించడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఈ సంవత్సరం రూ.9.20 కోట్ల విలువైన వస్త్రాలను విక్రయించాలని ఆప్కో, కో-ఆప్టెక్స్ లక్ష్యంగా పెట్టుకున్నాయి.
విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన బయ్యర్, సెల్లార్ మీట్లో రెండు రాష్ట్రాల చేనేత, జౌళి శాఖల మంత్రులు ఎస్. సవిత, ఆర్. గాంధీ సమక్షంలో ఆప్కో ఎండీ పావన మూర్తి, కో-ఆప్టెక్స్ ఎండీ దీపక్ జాకబ్ ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తిరుచ్చి, మధురై, ఈరోడ్, సేలం ప్రాంతాలకు చెందిన పలు సంస్థలతో పాటు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సంస్థలతో ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా తమిళనాడు చేనేత వస్త్రాలను ఆప్కో మరియు ఇతర వ్యాపార సంస్థలలో విక్రయిస్తారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలను కో-ఆప్టెక్స్ షోరూమ్లతో పాటు తమిళనాడులోని వివిధ వస్త్ర దుకాణాలలో విక్రయిస్తారు. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం, తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రయవిక్రేతల సదస్సును మంత్రి సవిత ప్రారంభించి చేనేత వస్త్రాల స్టాళ్లను పరిశీలించారు. .