హిమాచల్ ప్రదేశ్లో వరదల పరిస్థితిపై ప్రముఖ టెలివిజన్ నటి, బిగ్ బాస్ విన్నర్ రుబీనా దిలైక్ తీవ్ర ఆందో ళన వ్యక్తం చేసింది. అక్కడ కురుస్తోన్న భారీ వర్షాలు, వరదల కారణంగా తన కవల కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు హిమాచల్లో చిక్కుకుపోయారని ఆమె వాపోయింది. రుబీనా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు అక్కడే నివసిస్తున్నారు. అయితే ఓ ముఖ్యమైన పని కోసం రుబీనా ఇప్పుడు ముంబైకు వచ్చింది. ఆమె కవల పిల్లలు హిమాచల్లో తమ అమ్మమ్మతో కలిసి ఉంటున్నారు. అయితే ఇప్పుడు తమ రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు తన ఫ్యామిలీ గత మూడు రోజులుగా హిమాచల్లోని ఒక ఫామ్హౌస్లో ఉంటోందని వాపోయింది. అక్కడ విద్యుత్ సరఫార, నెట్వర్క్ లేదని, వారి పరిస్థితిని వివరిస్తూ రుబీనా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. వారి కోసం ప్రార్థిస్తున్నట్లు అందులో తెలిపింది.
‘ నేను ఇంకా హిమాచల్ ప్రదేశ్లో వరద పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడటం లేదని చాలా మంది అంటున్నారు. కానీ అక్కడ నా సొంత కుటుంబమే చిక్కుకుపోయింది. నా కవల పిల్లలు, తల్లిదండ్రులు ఒక ఫామ్ హౌస్ లో బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. గత మూడు రోజులుగా అక్కడ విద్యుత్ లేదు, మొబైల్ నెట్వర్క్ లేదు. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నప్పటికీ, అక్కడి పరిస్థితి గురించి నేను నిరంతరం ఆందోళన చెందుతున్నాను. నేను వారిని చేరుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాం.. కానీ అది సాధ్య పడడం లేదు. నేను నా పిల్లల గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే గత రెండు వారాలుగా మా విమానాలను రీషెడ్యూల్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లే అవకాశం మాకు దొరకడం లేదు. కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడతాయి. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. 15 రోజుల క్రితం నేనే ఒక విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నాను..నేను ఇప్పుడు వరదల్లో చిక్కుకున్న అందరి కోసం ప్రార్థిస్తున్నాను. అక్కడి పరిస్థితులు వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలని నిరంతరం దేవుడిని వేడుకుంటున్నాను’ అంటూ రుబీనా తెలిపింది. రుబీనా 2018లో అభినవ్ శుక్లాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2023లో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆమె కూతుళ్ల పేర్లు జీవా, ఇధా. ప్రస్తుతం రుబీనా, అభినవ్ ‘పతి పత్ని ఔర్ పంగా 2’ షోలో కనిపిస్తున్నారు.