క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగగా, గురువారం నుంచి భారత జట్టు రంగంలోకి దిగుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తన మ్యాచ్లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తొలి మ్యాచ్ లో ఈ రోజు బంగ్లాదేశ్ తో తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లో మన టీమిండియా తరఫున ఆడే 11 మంది ఎవరు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగ్లాతో జరిగే మ్యాచ్ లో రోహిత్, గిల్ భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నంబర్ 3 స్థానంలో బరిలోకి దిగుతాడు. శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగే అవకాశం ఉంది. ఇటీవల వన్డే ఫార్మాట్ లో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కంటే కేఎల్ రాహుల్ కు సెలక్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో అతడే కీపింగ్ చేశాడు. దాంతో ఐదో స్థానంలో రాహుల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే ఆల్ రౌండర్ల విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఆడించాలని భావిస్తున్నారు. ఈ ముగ్గురు లోయర్ మిడిల్ ఆర్డర్ను మరింత పటిష్ఠంగా మార్చే సత్తా ఉన్న ప్లేయర్లు. దాంతో ఈరోజు మ్యాచ్ లో వీరు తప్పకుండా బరిలోకి దిగుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ పేసర్లుగా, కుల్దీప్ యాదవ్ మూడవ స్పిన్నర్ గా ఆడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తో జరిగే భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.