ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఉగాది రోజున ఈ పురస్కారాలను అందజేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల విధి విధానాలకు సంబంధించి నేడు దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఆయన మాట్లాడుతూ.. పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వబోతున్నట్లు దిల్ రాజు తెలిపాడు. అలాగే తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలకు అవార్డులలో ప్రాధాన్యత ఉంటుందని.. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమాకు గద్దర్ అవార్డు ఇస్తామని వెల్లడించాడు. ఏప్రిల్లో అంగరంగ వైభవంగా అవార్డుల వేడుక ఉంటుందని వెల్లడించాడు. గతంలో సింహా అవార్డులకు దరఖాస్తు చేసుకున్నవారికి వారి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తెలిపాడు.ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైఖ్యతా చిత్రం, బాలల చిత్రం, పర్యావరణం, చారిత్రక సంపద తదితర విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీటితో పాటు తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ , షార్ట్ఫిల్మ్ విభాగాల్లో కూడా అవార్డులను అందించనున్నారు.