ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. హైదరాబాద్లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దిల్ రాజు భార్య తేజస్వినిని అధికారులు బ్యాంక్కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తేజస్విని మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు. దిల్ రాజు నివాసాలతోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసాలతోపాటు పుష్ప 2 సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని, మైత్రి మూవీస్ కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.