గద్దర్ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి గద్దర్ చలనచిత్ర అవార్డులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ శనివారం నాడు సమావేశం అయింది. అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ ఈ భేటీలో చర్చించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందిస్తామన్నారు.జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫీచర్ సినిమాలు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు తదితర వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అవార్డుల్లో నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందజేయనున్నట్లు చెప్పారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తెలిపారు. గద్దర్ అవార్డుకు సంబంధించి లోగోను కూడా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో టీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, ఎండీ డాక్టర్ హరీశ్, ఈడీ కిశోర్బాబు, కమిటీ చైర్మన్ బీ నర్సింగ్రావు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్, హరీశ్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్, వేణు పాల్గొన్నారు