భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ (61) నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ) పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఈ నోటిఫికేషన్లలో వెల్లడించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితాలో జ్ఞానేశ్ కుమార్ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎంపిక చేశారు. దీంతో సెలక్షన్ కమిటీ ఖరారు చేసిన నూతన సీఈసీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం సోమవారం రాత్రి భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 19న జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఈ పదవిలో 2029 జనవరి 26 దాకా కొనసాగుతారు. అలాగే ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ స్థానంలో హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ వివేక్ జోషిని నియమించారు.