స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ విషయంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయకుండా, తన ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ‘గ్రాజియా ఇండియా’ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మేగజీన్ తాజా ఎడిషన్ కవర్ పేజీపై కూడా సమంత మెరిశారు.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, “ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయను. నా శరీరం చెప్పే మాట వినాలని తెలుసుకున్నాను. అందుకే పనిభారాన్ని తగ్గించుకుంటున్నాను. నా శారీరక, మానసిక ఆరోగ్యానికే నా మొదటి ప్రాధాన్యత” అని తెలిపారు. అయితే, ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత విషయంలో మాత్రం కచ్చితంగా పెరుగుదల ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. “తక్కువ సినిమాలు చేసినా, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలతోనే పలకరిస్తాను” అని వివరించారు.గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని, గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందని సమంత అన్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ, “సామాజిక మాధ్యమాల్లో మనకు వచ్చే ప్రశంసలను ఎలా ఆనందంగా స్వీకరిస్తామో… ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లను కూడా అంతే హుందాగా తీసుకోవాలి. అది మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్లకూడదు” అని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం సమంత.. రాజ్, డీకే దర్శకత్వంలో ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.