..బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షం
– మద్దతిచ్చిన టీడీపీ, జనసేన
– తీవ్ర వ్యతిరేకతతో బిల్లును జేపీసీకి పంపిన కేంద్రం
..బిల్లుకు మద్దతుగా మాట్లాడని జేడీయూ
ఫెడరలిజంతో సహా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి.. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపం, సమాఖ్య వాదంపై దాడి చేస్తుందని పేర్కొన్నాయి. అందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం, ఎలా కేంద్ర పదవీకాలంలోకి మార్చుతారని ప్రశ్నించాయి. అలా మార్చడం సాధ్యం కాదని తెలిపాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును, లోక్సభ ఎన్నికలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రవేశపెట్ట డాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ కోరాయి. ఈ ఓటింగ్లో 269 మంది సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లును సమర్పించడానికి మద్దతు ఇచ్చారు. దీనికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. 198 మంది సభ్యులు బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. ప్రజెంటేషన్ దశలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో, వివాదాస్పద బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం సభకు హామీ ఇచ్చింది.
నిబంధనల మేరకు తీర్మానం తీసుకురానున్నట్టు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. మనీష్ తివారీ, గౌరవ్ గొగొరు (కాంగ్రెస్), అమ్రారామ్ (సీపీఐ(ఎం), ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ), టిఆర్ బాలు (డీఎంకే), కళ్యాణ్ బెనర్జీ (టీఎంసీ), సుప్రియా సూలే (ఎన్సీపీ), అనిల్ దేశారు (శివసేన ఠాక్రే), మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం), ఎన్కె ప్రేమ్చంద్రన్ (ఆర్ఎస్పీ) వంటి ప్రతిపక్ష ఎంపీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ, శివసేన శిండే వర్గం బిల్లుకు మద్దతు పలికాయి. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ), శ్రీకాంత్ ఏక్నాథ్ శిండే (శివసేన శిండే) మాట్లాడుతూ బిల్లును సమర్థించారు.
బిల్లుకు మద్దతుగా మాట్లాడని జేడీయూ
ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన భాగమైన జేడీయూ నుంచి ఎవరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడలేదు.’ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే భావన రాజ్యాంగంలోని ఫెడరలిజంతో సహా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని ప్రతిపక్ష సభ్యులు అన్నారు. ‘బిల్లులోని నిబంధనలు చట్టాన్ని రూపొందించే సభ అధికార పరిధిని ఉల్లంఘిస్తాయి. లోక్సభ పదవీకాలం ప్రకారం శాసన సభల పదవీకాలం నిర్ణయించబడదు. చట్టసభలు విడివిడిగా ఉంటాయి. ఈ బిల్లుతో అధిక కేంద్రీకరణ అమలులోకి వస్తుంది. ఒక వ్యక్తి కోరికల నెరవేర్పు కోసమే ఈ బిల్లులను తెస్తున్నారు.
‘ అని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. సమగ్ర అధ్యయనం, విస్తృత చర్చల తర్వాతే బిల్లు తీసుకొచ్చామని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా కోరిందని, 31 పార్టీలు అనుకూలంగా నిలిచాయని, కేవలం 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని మేఘ్వాల్ అన్నారు. బిల్లులు క్యాబినెట్ పరిశీలనకు వచ్చినప్పుడు జేపీసీ పరిశీలనకు వదిలేయాలని ప్రధాని ఇప్పటికే చెప్పారని హౌం మంత్రి అమిత్ షా అన్నారు.
బిల్లు రాజ్యాంగ విరుద్ధం : డీఎంకే ఎంపీ కనిమొళి
‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లోక్సభలో ఖరాఖండిగా చెప్పినట్టు డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు. ఈ బిల్లు సమాఖ్య హక్కులకు, ప్రజల ఆకాంక్షలకు కూడా విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు ఐదేండ్ల కాలానికి ఎన్నుకుంటారని, కానీ మీరు వాళ్ల హక్కును దూరం చేస్తారని అనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల నుంచి లాక్కుని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలిపారు. కేంద్రం ఆ బిల్లును అమల్లోకి తీసుకొస్తే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. కావున తాము ఈ బిల్లును అంగీకరించబోమని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీలు డుమ్మా..
లోక్సభలో జమిలీ బిల్లు పెడు తున్న దృష్ట్యా ఎంపీలంతా హాజ రుకావాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీ విప్ జారీచేసింది. అయినా పదిమంది ఎంపీలు గైర్హాజర య్యారు.ఆ ఎంపీల తీరుపై కమలం పార్టీలో కలవరం మొద లైంది. వెంటనే తేరుకుని ఆ పది మంది ఎంపీలకు సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రాల హక్కులను ఎలా లాక్కొంటారు? : సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్
సీీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్ మాట్లా డుతూ ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశ గణతంత్ర రాజ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీ, మండలపరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ రాష్ట్ర ఎంపీ అమ్రారామ్, సీపీఐ(ఎం)ప్రభుత్వానికి సంబంధించినవని, కానీ ఈ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో వెళ్లిపోతాయని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ విధానాలు, భాషలు, అధికారాలు ఉన్నాయని, వాటిని కేంద్రం ఎలా లాక్కొంటుందని విమర్శించారు. కేవలం ఫాసిస్ట్ విధానాలతో ఈ బిల్లును తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.