మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి గత నెల 27న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి ముఖ్య అనుచరుడు, వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మందల వెంకట శేషయ్యకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన తనను లైంగికంగా వేధించారన్న ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసులపై కాకాణి తీవ్రంగా స్పందించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటాచలం సీఐ సుబ్బారావు ఖాకీ దుస్తులు తీసేసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు, లోకేశ్ చుట్టూ తిరగాల్సిందేనని హెచ్చరించారు. కాగా, పోలీసులను, అధికారులను మాజీమంత్రి కాకాణి బెదిరించారని, కేసు విచారణ సక్రమంగా జరగకుండా నిర్వీర్యం చేయాలని చూశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై కేసు నమోదు చేశారు.