ఇండియాను ‘హిందీయా’గా మార్చాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చూస్తోందని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ఈ అంశంపై కమల్ హాసన్ కూడా స్పందించారు.అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి, ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే వారు (బీజేపీ) మాత్రం హిందీయా గురించి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా అంశాలపై ఈరోజు తమిళపార్టీలు సమావేశమయ్యాయి. పార్టీలు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ సమావేశంలోనే కమల్ హాసన్ మాట్లాడారు.ఈ సందర్భంగా కమల్ హాసన్ 2019లో స్టాలిన్ వాడిన ‘హిందీయా’ పదాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయంగా భారత్ అంటే హిందీ భాష గుర్తుకు వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టుపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ‘ఇది ఇండియా… హిందీయా కాదు’ అని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను కమల్ హాసన్ తాజాగా ప్రస్తావించారు.