కాంతార సినిమాకు ప్రీక్వెల్ షూటింగ్ కర్ణాటకలోని కుందాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలోనూ గ్రామీణ నేపథ్యంతో పాటు అక్కడి దేవతామూర్తుల కథను తెలుపనున్నాడు రిషబ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా, కాంతార చిత్రయూనిట్ పై తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.అటవీ ప్రాంతంలో నిప్పంటించి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే చిత్ర బృందానికి నిరసనగా గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చారు. కాంతార 2 సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కుందాపూర్లో జరుగుతున్నాయి. దీని కోసం రిషబ్ తన స్వగ్రామానికి మకాం మార్చుకున్నాడు.
హాసన్ జిల్లా సకలేష్పూర్ తాలూకా హేరురు గ్రామ అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. జనవరి 2 నుంచి అక్కడ షూటింగ్ జరుగుతోంది. గోమా లొకేషన్ షూటింగ్ కోసం చిత్ర బృందం అనుమతి కూడా తీసుకుంది.అయితే అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు చిత్రబృందం చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అడవిలో మంటలు చెలరేగడంతో అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయని అంటున్నారు గ్రామస్థులు. వన్యప్రాణులు ఉన్న ప్రాంతంలో షూటింగ్ చేయకూడదన్నది గ్రామస్తుల డిమాండ్. వెంటనే షూటింగ్ ఆపి పర్యావరణాన్ని కాపాడండి. లేనిపక్షంలో డీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. మరి దీని పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.