భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఐఫా’ అవార్డ్స్ వేడుక రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా ముగిసింది. జైపూర్ ఎగ్జిబిషన్ & కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 8వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక.. ఆదివారంతో ముగిసింది. మొదట డిజిటల్ అవార్డులను ప్రకటించిన నిర్వాహకులు.. ఆదివారం రాత్రి చలనచిత్ర అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్ సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ కథ ఇలా ఏకంగా పది కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుని సత్తా చాటింది.
భూల్ భూలయ్యా 3’కు ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్ అవార్డు సొంతం చేసకున్నారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ప్రోడక్షన్లో వచ్చిన చిత్రం ‘లాపతా లేడీస్ . ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. జమ్తారా వెబ్సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా గతేడాది మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నది. సుప్రీం కోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా.. కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది.