పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలతో మెరిసిన భారత స్టార్ షూటర్ మనూ భాకర్ కు బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పేర్లు నామినేషన్ లో ఉండగా, భాకర్ నే పురస్కారం వరించడం విశేషం. 22 ఏళ్ల ఈ క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్ గా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ రెండింటిలోనూ మనూ కాంస్యం సాధించారు. ఇక ఒలింపిక్స్ లో ఆమె అద్భుత ప్రదర్శనకు గాను ఈ ఏడాది భాకర్ ను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత క్రీడా గౌరవం అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది.
