జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవని ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. జేఈఈ (మెయిన్స్)- 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచావు, మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏ అవసరం ఉన్నా ఒక్క మెసేజ్ పెట్టు అన్నగా అండగా ఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రతి బిడ్డ విజయంలో తల్లిపాత్ర ఏంటో తనకు తెలుసు అంటూ ఆమె తల్లిని కూడా లోకేశ్ సత్కరించారు.
మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న మనోజ్ఞ తండ్రితో కరికులం ప్రక్షాళనపై చర్చించారు. ఇండస్ట్రీకి అవసరమైన కరికులం ఉండాలనేది తన ఆలోచన, జాబ్ రెడీ యూత్ ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను ప్రోత్సహించాలనేది తన ధ్యేయమని అన్నారు. కేజీ టు పీజీ విద్యలో చేస్తున్న మార్పుల గురించి వివరించారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివి సాధించలేని ఉద్యోగం… నాలుగు నెలలు అమీర్ పేట లో కోర్స్ చేసి ఎలా సాధిస్తున్నారనేది నా ప్రశ్న. విద్యార్థి కాలేజీ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా తయారు కావాలన్నది తన ఆకాంక్షగా మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.