తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ పనులు జరుగుతుండగా టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మరికొందరు అందులోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరాలు అడిగారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి ఆరా తీశారు. ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలను రేవంత్ రెడ్డి వివరించారు. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు దగ్గర ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద ఘటనాస్థలికి చేరుకున్నాయి. విజయవాడ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒక బృందం చేరుకుంది. టన్నెల్లో చిక్కుకున్న వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు ఉన్నారు.