ఏపీ డిప్యూటీ సీఎం..నటుడు పవన్ కల్యాణ్ కు బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉందన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఎప్పుడు సమయం దొరికినా పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. తాజాగా తన సొంత డబ్బు రూ. 10 లక్షలతో పవన్ కల్యాణ్ పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పుస్తక మహోత్సవం జరుగుతోంది. ఈ పుస్తక మహోత్సవంకు పవన్ వచ్చారు. ఆయన అక్కడకు వస్తున్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఆ లైబ్రరీ కోసం ఆయన ఈ పుస్తకాలను కొన్నట్టు తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేయాలని పవన్ భావిస్తున్నారు.