గూగుల్లో నిత్యం ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం… ఏ సమాచారం తెలుసుకోవడానికైనా మనం మొదట ఆధారపడేది గూగుల్ పైనే.. మరి ఈ ఏడాది-2024 పొడవునా మన భారతీయులు ఎక్కువ దేని గురించి వెతికారో తెలుసా? భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసింది దేన్నంటే.. క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ .. గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ ఐపీఎల్ టీ20 టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ ప్రచురించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చోటు దక్కించుకున్నారు. వ్యక్తుల గురించి అత్యధిక మంది సెర్చ్ చేసిన జాబితాలో పవన్ కల్యాణ్ కు చోటుదక్కింది.ఈ ఏడాది అత్యధికంగా వెతికన వాటిల్లో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దివంగతులైన టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేశారు.. ఇక సినిమాల విషయానికొస్తే స్త్రీ2 గురించి ఎక్కువ మంది ఆరా తీయగా.. ప్రభాస్ నటించిన కల్కి, సలార్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు. వీటితో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా నటించిన తెలుగు సినిమా హనుమాన్ మూవీ కూడా ఉంది.. ఇంకా.. హీరామండీ, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ల గురించి కూడా గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసినట్లు పేర్కొంది.