కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 82,319 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు రాగా ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి 62,737 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ… ఇది అపూర్వమైన విజయమని చెప్పారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు ముందే డిసైడయ్యారని అన్నారు. తన మెజార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా పీడీఎఫ్ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. పీడీఎఫ్ కూడా ఇతర రాజకీయ పార్టీలా తయారైతే సమాజంలో గౌరవం తగ్గిపోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తనకు ఓటు వేయడం గర్వంగా ఉందని అన్నారు. తాను నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తినని చెప్పారు. పీడీఎఫ్ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇచ్చిందని విమర్శించారు.