టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం నాడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్గా రూ. 45 కోట్ల (గ్రాస్) వసూళ్లు వచ్చాయి. ఇక రెండు రోజుల్లోనే రూ. 77 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇవాళ కూడా బుక్ మై షోలో వేలల్లో టికెట్స్ బుక్ అవడంతో రూ. 100కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, పైగా సంక్రాంతి పండగ సీజన్కు రావడంతో సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. మూవీలో వెంకీ ఫ్యామిలీ చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ను తెగ మెప్పిస్తోంది. ఇక ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు అందించగా.. వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ కలిసి దీనిని నిర్మించారు.