కాంగ్రెస్ తమ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేసింది. అయిదు స్థానాల్లో కాంగ్రెస్ కు నాలుగు సీట్లు దక్కనున్నాయి. బీఆర్ఎస్ కు దక్కే ఒక్క స్థానం నుంచి దాసోజు శ్రావణ్ పేరు ఖరారు చేసారు. మిత్రపక్షం సీపీఐకు ఒక సీటు కేటాయించిన కాంగ్రెస్.. తమ పార్టీ నుంచి ఎస్సీ – ఎస్టీ వర్గాలకు ఒక్కో సీటు కేటాయించారు. అనూహ్యంగా బీసీ – మహిళా కోటాలో విజయశాంతి పేరు ప్రకటించారు. అయితే, విజయశాంతి పేరు ప్రకటన వెనుక అనూహ్య పరిణామాలు.. సమీకరణాలు చోటు చేసుకున్నాయి. మరో కీలక పదవి పైన విజయశాంతికి హామీ దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు లో కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ అధి నాయకత్వం పక్కా వ్యూహాత్మకంగా ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసింది. రేవంత్ ఛాయిస్ మేరకు ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ కు సీటు ఖరారైంది.
ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరును ఫైనల్ చేసారు. శంకర్ నాయక్ సుదీర్ఘ కాలం పార్టీలో పని చేసారు. ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని తాజాగా సీనియర్ నేత జానారెడ్డి సిఫార్సు చేసారు. ఇక, అనూహ్యంగా బీసీ కోటాలో పార్టీ సీనియర్లు పలువురు చివరి నిమిషం వరకు రేసులో ఉన్నారు. అయితే..మాజీ ఎంపీ విజయశాంతి పేరును పార్టీ ఎంపిక చేసింది. ఈ ఎంపిక వెనుక పార్టీ ముఖ్య నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.విజయశాంతి ఇటీవలే పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను కలిసారు. రాష్ట్రంలో ప్రభుత్వం – పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. తాను పార్టీలో క్రియాశీలకంగా పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలో నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే తనకు ఇచ్చిన హామీని గుర్తు చేసారు. ఇదే అంశం పైన ఎమ్మెల్సీల ఖరారు వేళ ఖర్గే – కేసీ వేణుగోపాల్ మధ్య చర్చ జరిగింది.తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ తోనూ మాట్లాడారు. మీనాక్షి.. ఎమ్మెల్సీగా రాములమ్మ కు అవకాశం ఇవ్వాలని సూచించినట్లు పార్టీ నేతల సమాచారం.